శ్రీరామ నవమి విశిష్టత

Table of Contents
శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి రోజున దేశ వ్యాప్తంగా “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటాం. వీధుల్లో, రామాలయాల వద్ద తాటాకు పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. రాములవారికి అరటి పండ్లంటే ప్రీతికరం కనుక పూజ చేసేటప్పుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి.
ఇళ్ళల్లో కూడా తమ శక్తి మేరకు రామున్ని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి ప్రసాదంగా అందరికీ పంచుతారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా పేద, ధనిక బేధాలు లేకుండా రాములవారి ప్రసాదంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన “పుత్ర కామేష్టి యాగ” ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు. దశావతారాల్లో రామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణాసురుడు దైవారాధకులను, మునులను మరియు దేవతలను ఇబ్బంది పెడుతూ లోకాలని గందరగోళం చేస్తున్నాడు.
Also Read: భారతీయ సంస్కృతిలో శ్రీరామనవమి ప్రత్యేకత
శ్రీరాములవారు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించారు. మనుష్యుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించి కాపాడుకోవాలి అని ఆచరించి చూపించిన గొప్ప పురుషుడు శ్రీరామచంద్రుడు. భద్రాచలంలో ఏ రోజైతే శ్రీరామ నవమి పండగను చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి.
శ్రీరామనవమి రోజున చెయ్యాల్సినవి
అందరూ శ్రీరామ నవమి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి, ఇంటిని తోరణాలతో అలంకరించి, కొత్త వస్త్రాలు ధరించాలి. ఇంట్లో పూజలు వీలుకానిపక్షంలో దేవాలయాల్లో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలను దర్శించుకోవాలి. ధ్యాన ఆవాహనాధి షోడశోపచారాలతో శ్రీరామున్ని పూజించాలి. ఈ పూజలో శ్రీ సీతారాములని అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అయిపోయాక దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి, వీలైతే కొందరికైనా తీర్ధంగా ఇస్తే మంచిది. ఈ రోజు ఉపవాసం లేదా జాగరణ చేసి రామాయణ పఠనం లేదా పారాయణం చెయ్యడం వల్ల విష్ణులోక ప్రాప్తికలుగుతుంది. అలానే రామనామస్మరణం చెయ్యడం, రామకోటి వంటివి వ్రాయడం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని, పాపాలు తొలగి, జయాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి.
రామ నామం యొక్క అర్థం?
శ్రీరామచంద్రమూర్తికి రామాయణంలో వశిష్ట మహర్షి గారు నామకరణం చేసారు. రామాయణం ప్రకారం, రామ రహస్యోపనిషత్తు ప్రకారం రామ నామానికి అనేక రకములైన అర్థాలున్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అంటే.. యోగీశ్వరులు ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో అతనే శ్రీరాముడు అని అర్థం. “రామ” అనే దానికి అర్థం రాక్షస యేన మరణం యాంతి రామ. అంటే ఎవరిచేత రాక్షసులు మరణిస్తారో అతడే రాముడు అని.
రామ నామమును తారకమంత్రమని, తారకమంత్రం అనగా తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రం చెప్పినా దానిముందు ఓం అని, తర్వాత నమః అని ఖచ్చితంగా ఉంటుంది. కానీ రామ నామానికి రామ అనే మంత్రానికి ఇవి వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ, శ్రీరామ అనుకుంటూనే విష్ణులోకాన్ని పొందవచ్చు.
పురాణాల ప్రకారం.. పూర్వం శివుడు పార్వతీదేవికి “శ్రీరామ నామ” గొప్పతానాన్ని తెలియజేస్తూ
శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే
అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు. విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే ముగిస్తారు. శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ అని మూడు సార్లు అంటే ఇందులోనే వెయ్యి నామాలు ఉన్నాయని, సకలదేవతలూ ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసాడు.
రామ జపం
‘రామ’ అనే రెండక్షరాలను జపించడం ద్వారా మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతే కాదు, ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు కూడా. ఈ మంత్రరం పఠించడానికి ముందు శ్రీరాముని చిత్రపటం లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చెయ్యడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి.
శ్రీరాముని అనుగ్రహం కోసం
శ్రీరామనవమి నాడు రాముని విశిష్టత తెలియజేసే ఈ శ్లోకాలను చదవండి, చదివించండి.. వాళ్ళు రాముని జీవితం ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దడం మన కర్తవ్యం.
‘‘ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహుమ్
దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్’’
ఈ శ్లోకాలను పఠించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
సుందరకాండ పఠించాలి
రామ భక్తులందరూ శ్రీరామ నవమి రోజున విధిగా శ్రీరాముడిని స్మరించుకోవాలి. ఈ రోజున చేపట్టిన కార్యాలు విజయవంతం కావడం కోసం సుందరకాండను ఏకాగ్రతగా భక్తిపూర్వంగా పఠించాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి. మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందడం కోసం గంగా జలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలోకి తీసుకుని ‘ఓం శ్రీ హ్వీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
దాన ధర్మాలు చేయాలి
శ్రీరామ నవమిలాంటి పవిత్రమైన రోజున ఆర్ధిక పరిస్థితి బాగుంటే కనుక రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. పురాణాల ప్రకారం చూస్తే శ్రీరాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారు. ఇలా దానం చేయడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తారు. దీంతో మీకు శుభ ఫలితాలొస్తాయి. అదే విధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం, బట్టలు తదితర వస్తువులను దానం చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది.