సోమవతి అమావాస్య విశిష్టత

భారతీయ సనాతన ధర్మంలో అమావాస్యకు విశేష ప్రాధాన్యం ఉంది. ఇందులో ప్రత్యేకంగా “సోమవతి అమావాస్య” అనే రోజు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. సోమవారం మరియు అమావాస్య ఒక్కటే రోజున కలిగినప్పుడే దీనిని “సోమవతి అమావాస్య ” అంటారు. ఈ రోజు ఉపవాసం, తీర్థస్నానం, పితృకార్యాలు చేయడం వల్ల శరీర శుద్ధి, మనోనిర్మలత మరియు ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: “ఐదు” యొక్క విశిష్టత
సోమవతి అమావాస్య యొక్క పురాణ ప్రాశస్త్యం:
పురాణాల ప్రకారం సోమవతి అమావాస్యను పాటించడం వల్ల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇది మహాభారతంలో కూడా పేర్కొనబడింది. శ్రీభీష్మాచార్యులు యుధిష్ఠిరునికి ఈ రోజు విశిష్టతను వివరించినట్లు కథనం ఉంది.
దక్షయజ్ఞం కథ మనందరికీ తెలిసిందే! దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానించేందుకుగాను “నిరీస్వర ” యాగాన్ని తలపెట్టాడు. పరమేశ్వరునికి ఆహ్వానం లేకున్నా తన తండ్రి మీద ఉన్న ప్రేమతో శివుడు వద్దని వారిస్తున్న వినకుండా శివుని భార్య అయిన సతీదేవి ఆ యాగానికి వెళ్ళింది. అక్కడ సమస్త దేవతల సమక్షంలో దక్షుడు పరమేశ్వరుని అవమానిస్తాడు. తన కుమార్తె అన్న ఆలోచన లేకుండా సతీదేవిని కూడా అవమానిస్తాడు. ఈ అవమానాన్ని సహించలేని సతీదేవి తనని తాను ఆత్మార్పణ చేసుకుంటుంది. సతీదేవి మరణ వార్త విన్న పరమేశ్వరుడు ఎంతో మహోగ్రరూపుడై , తన కేశంతో వీరభద్రుని సృష్టిస్తాడు. దక్షయజ్ఞని భగ్నం చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. వీరభద్రుడు ప్రమదగణాలతో పాటు వెళ్లి యజ్ఞానికి వచ్చిన వారందరినీ శిక్షిస్తాడు. అలా శివగణాల చేతిలో శిక్షింపబడిన వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి తోడల్లుడు అవుతాడు.
ప్రమధగణాలు వేసిన శిక్షకి తాళలేక చంద్రుడు పరమేశ్వరుని సమీపించి తన తప్పుకు క్షమించమని వేడుకుంటాడు. చంద్రుని బాధని చూసిన భోళాశంకరుడు కరుణించి పరిహారం చెప్తాడు. సోమవారం అమావాస్య తిథి ఉన్న రోజున ఎవరైతే ఆ పరమేశ్వరుని పూజించి అర్చన అభిషేకాలు చేస్తారో, వారు ఆరోగ్యవంతులవుతారని ఆశీర్వదిస్తాడు. పరమేశ్వరుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసి వచ్చిన రోజున శివునికి అర్చన అభిషేకాలు చేసి , తన అనారోగ్యాల నుంచి విముక్తుడు అవుతాడు. అప్పటినుండి సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజుని ‘సోమావతి అమావాస్య గా ‘ పిలుస్తారు. కాబట్టి ఎవరైతే ఈ సోమావతి అమావాస్య రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం, బిల్వపత్రాలతో అర్చన అభిషేకాలు చేస్తారో వారు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లుతారు. ఆ పరమేశ్వర కృపకు పాత్రులు అవుతారు. పితృదేవతల ఆశీర్వాదం కోసం, సంతానాభివృద్ధి కోసం మరియు కుటుంబ క్షేమం కోసం ఈ రోజు శివారాధన చేయాలి.
పవిత్ర కర్మలు మరియు ఆచారాలు:
- తీర్థ స్నానం: గంగ, గోదావరి, నర్మద, కృష్ణ, తుంగభద్ర వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల శరీరపాపాలు తొలగుతాయని నమ్మకం. నదుల దగ్గర లేని వారు తమ ఇల్లు వద్ద శుద్ధ నీటితో స్నానం చేసి తులసి అరటి పత్రాలను కలిపి అభిషేకిస్తారు.
- తర్పణం & పిండప్రదానం: ఈ రోజున పితృదేవతల కోసం తర్పణం చేయడం వల్ల వారు సంతోషించి మన కుటుంబానికి ఆశీర్వాదాలను ఇస్తారని విశ్వాసం. కొందరు శ్రాధ్ధాన్నీ నిర్వహిస్తారు.
- శివపూజ & మహావిష్ణు పూజ: శివుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేయడం, రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయడం విశేష ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
- ఉపవాసం: ఈ రోజు సంపూర్ణ ఉపవాసం చేయడం ద్వారా శరీరానికి శుద్ధి, మనస్సుకు శాంతి లభిస్తాయి. సాయంత్రం ఫలహారం స్వీకరించాలి.
ముగింపు:
సోమవతి అమావాస్య రోజున గడించిన పుణ్యం అనేక జన్మలకు తాళిక పెడతుందని పౌరాణిక విశ్వాసం. ఇది పితృకార్యాలకు, ఆధ్యాత్మిక సాధనకు, మరియు దైవానుగ్రహానికి ఒక సోపానం. అందువల్ల, ప్రతి ఒక్కరము దీన్ని నిజమైన శ్రద్ధతో పాటించాలి. కాబట్టి ఇలాంటి పవిత్రమైన రోజుల్లో ధర్మకార్యాలలో పాల్గొనడం మానవుని జీవితానికి శుభదాయకంగా ఉంటుంది. స్తోత్రాలతో ఆ పరమేశ్వరుని ఆరాధించి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది