నృసింహ జయంతి ప్రాముఖ్యత

వైశాఖ మాసం ఎంతో శ్రేష్ఠమైంది. అలా అనటానికి మరో కారణం ఈ మాసంలో వచ్చే నృసింహ జయంతి. ఇది వైశాఖ శుక్ల చతుర్ధతి రోజున జరుపుకొంటారు. విష్ణుమూర్తి యొక్క పది అవతారాల్లోని నలుగవ అవతారమే “నరసింహస్వామి“. నరసింహ అనే పేరు నరసింహస్వామి రూపంలో ఉన్న దేహం మానవ రూపంలో, తల సింహం రూపంలో ఉండటం ద్వారా వచ్చింది. నరసింహస్వామి మాహా శక్తి వంతమైన అవతారం. నృసింహ జయంతి రోజును ఆ అవతారంలో ఉన్న నరసింహస్వామి రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టినందుకు నృసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు.
Table of Contents
విష్ణుమూర్తి యొక్క పది అవతారాల్లో నాలుగో అవతారం “నరసింహ అవతారం” అని చెప్పుకున్నాం. భక్తులను హింసిస్తూ పాపాలను మూటగట్టుకుంటున్న హిరణ్యకశిపుడిని సంహరించేందుకు ఆ స్వామి ఈ అవతారాన్ని స్వీకరించి ప్రదర్శించిన రోజునే మనం నృసింహ జయంతిగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల చతుర్దశి రోజున వచ్చే ఈ నృసింహ జయంతిని ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున వైభవంగా జరుపుతారు.
“ఇందుకలడు అందులేడని సందేహం వలదు” అని అణువణువునా ఆ శ్రీహరినే చూసిన భక్త ప్రహ్లాదుడి మాటని వమ్ము కానివ్వకుండా స్థంభంలో నుంచి బయటకొచ్చిన నారసింహుడు హిరణ్యాక్షుడిని వధించి ఆ కోపంలో ఉగ్ర నారసింహుడిగా అవతారమెత్తుతారు స్వామి. ప్రహ్లాదుడి యొక్క విన్నపం మేరకు ఉగ్ర రూపాన్ని విడిచి నారసింహుడిగా కూడా అనేక ప్రాంతాల్లో స్వామివారు వెలిసారు.
మన పురాణాల ప్రకారం నరసింహుడిని పూజించడం వలన ఆపదాలు నశిస్తాయి. ఎంతటి ఆపదలో ఉన్నవారైనా సరే నియమ నిష్టలతో స్వామి వారిని కొలవడం చేత ఆపదల నుంచి గట్టెక్కుతారని విశ్వాసం. నరసింహ కరావలంబం చదివి శరణు కోరితే కష్టాలు మన దరికి చేరవు. అలాగే ఋణ విమోచన నారసింహ స్తోత్రం చదివితే అప్పుల బాధలు సమసిపోతాయి కూడా.
మన తెలుగు రాష్ట్రాల్లో పలు నరసింహ స్వామి క్షేత్రాలున్నాయ్. యాదగిరి గుట్ట, కదిరి, మంగళగిరి, వేదాద్రి, సింహాచలం మొదలైనవి ఎంతో ప్రాముఖ్యతని పొందాయి. నృసింహ జయంతి రోజున వేదాద్రిలోను, మంగళగిరిలోనూ కళ్యాణం జరిపిస్తారు. చాలామంది భక్తులు ఈ రోజున పానకం, వడపప్పు దేవుడికి నైవేద్యంగా పెడతారు.
పానకం నైవేద్యంలో రహస్యం
శ్రీరామనవమికి, నృసింహ జయంతికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచి పెట్టడంలో ఒక రహస్యం ఉంది. ఈ రెండూ ఎండాకాలంలో రావటం వలన బెల్లం, యాలకులు, మిరియాలు వేసిన పానకం తాగటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే వడపప్పు అంటే పెసరపప్పు. అది తిన్నా కూడా చలవ చేస్తుంది. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా మనకోసమే అనటానికి నిదర్శనమే ఈ ఆచారాలు. నృసింహ జయంతి నాడు ఎంతో మంది భక్తులు ఉపవాసం ఉంటారు.ఈ రోజు నారసింహుడిని…
మాతా నృసింహ, పితా నృసింహ
భ్రాతా నృసింహ, సఖా నృససింహ
విద్యా నృసింహ, ద్రవిణం నృసింహ
స్వామి నృసింహ , సకలం నృసింహ
అని ఎవరైతే స్వామివారిని తలుచుకుని మనస్పూర్తిగా పూజిస్తారో వారికి జీవితంలో కష్టాలని ఎదుర్కునే ధైర్యం, శక్తి పొందుతారు. నృసింహ ఉపాసన చేస్తే అది ఒక రక్షణ కవచంలా ఏర్పడి మనల్ని నిత్యం కాపాడుతూ ఉంటుంది.
నృసింహ జయంతి యొక్క ప్రాముఖ్యత
- మంచిపై చెడు యొక్క విజయం:
ఈ పండుగ నరసింహ స్వామివారు హిరణ్యకశ్యపుడిని సంహరించడం ద్వారా దుష్ట శక్తులపై ధర్మం గెలిచిన విజయానికి ఒక గుర్తుగా జరుపుకుంటారు.
- భక్తి యొక్క ప్రాముఖ్యత:
ప్రహ్లాదుడిని నరసింహ స్వామి రక్షించడం వలన భక్తి యొక్క గొప్పతనం మరియు భక్తిని కలిగి ఉన్నవారికి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది.
- భక్తి మరియు వినయత:
- దానాలు మరియు సేవల ద్వారా:
- ప్రేమ మరియు దయ:
నరసింహ స్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడిని ప్రేమతో మరియు దయతో రక్షించారు. కనుక ఈ పండుగన ప్రేమ మరియు దయ యొక్క ప్రాముఖ్యతను అందరికి తెలియజేస్తుంది.
మనం భగవంతుడికి పండ్లు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకోవాలి. కాకపోతే మనం ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనలకంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. మనసా, వాచా, కర్మణా స్వామిని ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు.
ఓం నమో నృసింహ దేవాయ నమ: