క్షేత్రపాలకుడు అంటే?

క్షేత్రపాలకుడు అనగా ఎవరు? గ్రామ రక్షకునిగా ఆయన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
క్షేత్రపాలకుడు అంటే ఆ క్షేత్రాన్ని” రక్షించేవాడు, పాలించేవాడు” అని అర్థం. హిందూ సంప్రదాయాలలో క్షేత్రపాలకుడు అనే గ్రామ దేవతకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో క్షేత్రపాలకుని గ్రామ రక్షకునిగా భావించి పూజిస్తారు. ఆ స్వామిని భద్రత, శాంతి మరియు చెడు శక్తుల నివారణకు కారకుడిగా భక్తులు విశ్వసిస్తారు. భక్తులు తప్పనిసరిగా ఆలయాల్లో ఈ స్వామిని దర్శించుకోవడం క్షేత్ర నియమంగా వస్తుంది.
Also Read: ‘ధర్మం’ అంటే ఏంటి?
క్షేత్రపాలకుడి ఆరాధన మరియు స్థానం
ప్రతి గ్రామానికి వెలుపల ఆయన స్థానం ఉంటుంది . చెడు శక్తులు ప్రవేశించకుండా నిలిపే దైవంగా పూజిస్తారు. గణపతి, భైరవుడు వంటి దేవతలతో సంబంధం ఉన్న క్షేత్రపాలకుడు మన గ్రామ సంస్కృతిలో శాంతి ,భద్రతలకు మార్గదర్శకుడు. క్షేత్రపాలకుడి ఆలయాలు సాధారణంగా గ్రామ సరిహద్దుల్లో లేదా దేవాలయ ప్రవేశ ద్వారాల దగ్గర ఉంటాయి. ఆయన విగ్రహాన్ని ఉగ్రరూపంలో చూస్తారు. కొన్నిచోట్ల ఆయనను భైరవ స్వరూపంగా కూడా పూజిస్తారు. క్షేత్రపాలకుడిని దూరంగా ఉండే దైవంగా కాకుండా తమ గ్రామాల్ని కాపాడే, చెడు శక్తులను అడ్డుకునే దైవంగా భావిస్తారు.
క్షేత్రపాలకుడికి జరిగే పూజలు ఆచారాలు
క్షేత్రపాలకుడికి ప్రత్యేకమైన పూజలు నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. మాంసాహార, మద్యం నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు . కొన్ని ప్రాంతాల్లో జాతర్ల సందర్భంగా ఆయనకి ప్రత్యేక తర్పణాలు బలి ఇవ్వడం కూడా జరుగుతుంది. కొన్నిచోట్ల ఆ స్వామి అనుమతి లేకుండా దేవాలయ ప్రవేశం చేయరాదని నమ్మకం కూడా ఉంది.
దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో క్షేత్రపాలకుని పూజించడం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలు ఆ స్వామిని తమకు రక్షణ కలిగించే తండ్రిలా భావిస్తారు. క్షేత్రపాలకుడిని సంతృప్తి పరచడం వల్ల గ్రామానికి చెడు శక్తులు రాకుండా , పంటలు బాగా పండుతాయని , ఆరోగ్యం – శాంతి ఏర్పడుతుందని ప్రజలు విశ్వసిస్తారు. సాధారణంగా క్షేత్రపాలకుడు అంటే ‘ శివుడే ‘ అని శైవాగమ శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే వైష్ణవాగమ శాస్త్రాల్లో కూడా ‘ దండపాణిగా ‘ శివుడే క్షేత్రపాలకునిగా దర్శనమిస్తాడు. శివాలయంలో ఆగ్నేయ దిక్కున ఈ స్వామి ఆలయం ఉంటుంది. ముందుగా ఆలయాల్లో క్షేత్రపాలక దర్శనం అనంతరం పరమేశ్వర దర్శనం చేయాలని నియమం ఉంది. ఈ నియమాలు అర్చనాది కైంకర్యాలు చేసే అర్చకులకు కూడా వర్తిస్తుంది . మనకి శాస్త్రంలో పరమేశ్వరుని 1000 వ అంశగా ఈ క్షేత్రపాలకుడు ఉద్భవించినట్లు సుప్రభేదాగమం చెబుతుంది. గ్రామ రక్షణ కొరకు ఈశాన్యంలో ఈ స్వామికి ప్రత్యేక ఆలయం కూడా నిర్మించాలని ఆగమ శాస్త్ర నియమం.
ఈ స్వామి నల్లని శరీర వర్ణంతో , గుండ్రని కన్నులతో, నగ్నంగా , పదునైన పళ్ళకోరలతో , భృకుటిని ముడిచి ఎర్రని పొడవైన కేశాలతో, శరీరంపై కపాలమాలతో , చేతుల్లో త్రిశూలం మరియు కపాలం వంటి ఆయుధాలతో నిలుచుని భైరవ వాహనంతో ఉంటాడు.
కొన్ని స్థల పురాణాల్లో మాత్రం విష్ణు క్షేత్రాలకి శివుడు క్షేత్రపాలకునిగా మరియు శైవ క్షేత్రానికి విష్ణువు క్షేత్రపాలకునిగా ఉంటారని జననానుడి. ఉదాహరణకు తిరుమలేశుని ఆలయంలో ఈశాన్యంలోని ‘ రుద్రశిల ‘ క్షేత్రపాలకునిగా ఉంది. అదేవిధంగా పంచారామ క్షేత్రాలన్నిటికి విష్ణుమూర్తి క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్నాడు. ఇంకా భద్రాచలం, కొన్ని నృసింహస్వామి క్షేత్రాలకి ఆంజనేయస్వామి అలాగే శ్రీశైలానికి వీరభద్రుడు, బద్రీనాథ్ క్షేత్రమునకు ఘంటా కర్ణుడు , శ్రీకాళహస్తి , ఉజ్జయిని , వారణాసి వంటి క్షేత్రాలలో ‘కాలభైరవుడు’ క్షేత్రపాలకునిగా ఉన్నాడు. కాబట్టి క్షేత్రపాలకుని దర్శనం, పూజ మనకు విశేష ఫలితాలను ఇస్తాయి.