అక్షయ తృతీయ విశిష్టత మరియు పూజ విధానం

సనాతన ధర్మంలో “అక్షయ తృతీయకు” ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున ముహుర్తం చూడకుండానే ఏ పని చేపట్టినా విజయం ప్రాప్తిస్తుందని పెద్దల మాట. అయితే ఈ పర్వదినాన వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం చాలామందిని ఆకర్షించేందుకు బంగారం, వెండితో పాటు కొత్త వస్తువులపై ధర తగ్గింపు అంటూ ప్రజల ఖజానా ఖాళీ చేసే ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ అక్షయ తృతీయ అంటే ఆ రోజునన విలువైన వస్తువులను కొనడమే కాదు “దానధర్మాలు” చేయడం ప్రధానం. నీళ్ళను దానం చేస్తే మరు జన్మలో ఎలాంటి రూపంలో జన్మించినా నీటికి సమస్య ఉండదు. అలానే ఆరోజు దానధర్మాలు చెయ్యడం వల్ల శ్రీమహా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం “అక్షయ తృతీయ” పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజున వచ్చింది. ఎవరైనా ఈ సంవత్సరం ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే మాత్రం అందుకు అక్షయ తృతీయ రోజున మొదలుపెట్టండి. అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా శుభ సమయం మరియు పూజా విధానం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం…
Table of Contents
శుభ ముహుర్తం
ఈ సంవత్సరం అక్షయ తృతీయ 29 ఏప్రిల్ 2025 మంగళవారం సాయంకాలం 5:32 నుంచి ప్రారంభమయి మరుసటి రోజు అనగా ఏప్రిల్ 30న బుధవారం మధ్యాహ్నం 2:13 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం చూస్తే ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ సమయంలో చేసే ఏ పనిలోనయినా మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున కొత్త వస్తువులు కొనడం, వివాహం,నూతన గృహంలోకి ప్రవేశించడం, నూతన వాహనం లేదా ఏదైనా ఆస్తి కొనడం, వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదం.
అక్షయ తృతీయ అర్ధం
“అక్షయం” అనగా ఎప్పటికీ తరగనిది. పురాణాల ప్రకారం, వేద వ్యాసుడిని శ్రీ మహా విష్ణువు యొక్క అవతారంగా పరిగణిస్తారు. వ్యాస మహర్షి “అక్షయ తృతీయ” రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టారు. ఆ పవిత్రమైన రోజే గంగాదేవి కూడా దివి నుంచి భువికి దిగి వచ్చింది. మహాభారతంలో శ్రీ క్రిష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది ఈరోజే. అలానే కుభేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీ దేవిని పూజించి ధనవంతుడయ్యాడు.
అక్షయ తృతీయ విశిష్టత
“వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే
నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే”
అంటే.. అక్షయ తృతీయ అనేది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణం పేర్కొంటుంది. కొన్ని ప్రాంతాల్లో వైశాఖ శుద్ధ తదియ రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఈరోజే “బదరీనారాయణ” మందిర ద్వారాలు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుస్తారు. అంత వరకు ఈ ఆలయం మంచుతో నిండిపోయుంటుంది. అలానే ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు చిన్ని కృష్ణుడికి, గౌరీదేవికి డోలోత్సవం జరిపించి ముత్తైదువలను, కన్యలను పూజించి ఫలములు పుష్పాదులు, శనగలు వాయనం ఇచ్చి సత్కరిస్తారు. ఈ అక్షయ తృతీయ పుణ్యదినం రోజున జరిపే హోమాలు, దానధర్మాలు, పిత్రుదేవతలకు, దేవతలకూ చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని, అందువలనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని ధర్మరాజుకు కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించారు.
పూజా విధానం
అక్షయ తృతీయ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి. పూజా చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేశి అనంతరం శ్రీమహా విష్ణువు విగ్రహం లేదా చిత్ర పటాన్ని ప్రతిష్టించి మంచి నీటితో శుద్ధి చేసుకోవాలి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, పండ్లు, పూలను తదితర వాటిని విష్ణువుకు సమర్పించాలి. వీలైతే పసుపు పువ్వులను సమర్పిస్తే మంచిది. ఇలా చెయ్యడం వలన విష్ణువు యొక్క ఆశీస్సులు లభిస్తాయి.
పూజ ముగిసిన తర్వాత విష్ణువు, లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి, మిఠాయిలను ప్రసాదంగా పంచాలి.
పురాణగాధ
అక్షయ తృతీయగురించి ఒక పురాణగాధ ఉంది. పూర్వం ఒక వైశ్యుడు ఎన్నో బాధలు వెంటాడుతున్నా సరే మంచి ప్రవర్తనని వదలకుండా జీవించేవాడు. ఓరోజు ఒక పౌరాణికుడు “వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేసే చిన్న దానమైనా సరే అక్షయ ఫలప్రదము” అని చెప్పగా, అది విని వైశ్యుడు ఆ రోజున గంగలో పుణ్యస్నానమును ఆచరించి దేవతలకు, పితృదేవలకు తర్పణమాచరించి, ఇంటికి వచ్చి సద్ బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి తన శక్తి స్తోమత బట్టి భోజన తాంబూలాలను దానమిచ్చాడు. అలా ఆచరించిన పుణ్యఫలమే అతడి వెంటవచ్చి మరుజన్మలో అతడు “కుశావతీ” నగరానికి రాజుగా జన్మించాడు. అయినా అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తిహించినా కూడా సంపద మాత్రం అక్షయమవుతుందేగాని తరుగలేదు. “అందువల్లనే మన పురాణ పెద్దల మాటలు పెడచెవిని పెట్టకుండా చక్కగా విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుంది.
ఈ రాశులవారు అక్షయ తృతీయ రోజున..
“వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా”
- మేషరాశి
అక్షయ తృతీయ రోజున మేషరాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వాములను అర్చనలు చేసి పాయసం దానం చేస్తే సుఖసంతోషాలు చేకూరే అవకాశం.
- వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించినవారు శాంతరూపంలో దర్శనమిచే అంబికాదేవిని స్మరించడం మరియు పూజించడం చెయ్యాలి. అమ్మవారికి చక్కెర పొంగలి, పాయసం లేదా రవ్వలడ్డును నైవేద్యంగా సమర్పిస్తే బాధలు తొలగిపోతాయి. ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
- మిథున రాశి
మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ రోజున విష్ణు – మహాలక్ష్మీలను పూజించడం ఎంతో శ్రేయస్కరం. శ్రీమహా విష్ణు – మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి, బ్రాహ్మణులకు మరియు పేదలకు చేతనైన సహాయం చెయ్యడం వలన ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని పురోహితుల మాట.
- కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించినవారు దుర్గా దేవిని పూజించాలి. దుర్గా దేవికి నేతితో దీపం వెలిగించి బియ్యప్పిండితో చేసే పదార్థాలను దానం చేయడం వలన అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
- సింహరాశి – కన్యారాశి
సింహరాశిలో జన్మించిన జాతకులు ఈశ్వరుడిని, కన్యారాశిలో జన్మించిన జాతకులు శ్రీమహా విష్ణు – మహాలక్ష్మీదేవిలను ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు చేకూరుతాయని పురోహితుల మాట. సింహ, కన్యారాశివారు అక్షయ తృతీయ రోజున శివకేశవులు వుండే దేవాలయాలను సందర్శించడం చాలా ఉత్తమం.
- తుల – వృశ్చిక – ధనుస్సు రాశులు
తులారాశిలో జన్మించిన జాతకులు దుర్గా దేవిని, వృశ్చిక రాశి జాతకులు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. ధనుస్సు రాశిలో జన్మించిన జాతకులు దక్షిణా మూర్తిని ఆరాధించడం ఉత్తమం. దక్షిణామూర్తికి తెల్లటి పూల మాలను సమర్పించుకోవడం వలన అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
- మకరరాశి
మకరరాశిలో జన్మించిన జాతకులు అక్షయ తృతీయ రోజున హనుమంతులవారికి తమలపాకుల మాల మరియు వెన్నను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడి ఈతిబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. విఘ్నేశ్వరునికి గరిక మాలను సమర్పించుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
- కుంభ రాశి – మీన రాశి
అలాగే కుంభ రాశిలో జన్మించిన జాతకులు శనీశ్వరున్ని, హనుమంతులవారిని, మీనరాశిని జాతకులు నందీశ్వరున్ని పూజించడం వలన వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు వరిస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.