శరన్నవరాత్రులు | నవదుర్గలు

శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఆ సమయంలో కలిగే వాతావరణ మార్పులు చాలా రోగాలకు కారణమవుతుంటాయి. అందుకే “అశ్వయుజ శుద్ధ పాడ్యమి” నుంచి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో జనమంతా శుచిగా, శుభ్రంగా ఉంటూ ఎలాంటి రోగాలు దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుకనున్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించారు.
నవదుర్గల స్తోత్రం :
ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||
1.శైలపుత్రి:
శరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారముగా బాల చంద్రరేఖను ధరించి, ప్రతిశూలాన్నీ చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చున్న అవతారమే “శైలపుత్రి”. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. అనగా ఎద్దులా మొద్దు స్వరూపాలైపోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం ఈ శైలపుత్రి అవతరం. అమ్మవారికి పొంగలి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పిస్తారు. ఇక శ్రీశైల సంప్రదాయం ప్రకారం.. కదంబం (సాంబారు అన్నం), మినపవడలు, రవ్వ కేసరి, పానకం నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.
శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం |
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
2. బ్రహ్మచారిణి:
శరన్నవరాత్రుల్లో దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసిస్తూ పూజించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.
శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
3. చంద్రఘంట:
శరన్నవరాత్రుల్లో అమ్మవారి మూడవ అవతారమే “చంద్రఘంట”. ఈ రూపం చాలా కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థ చంద్రుడు అర్ధాకృతలో ఉన్నందు వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు. ఈ తల్లిని శరణు వేడుకున్నవారికి ఎల్లవేళలా అభయఘంట మోగుతూ ఉంటుంది.
శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
4. కూష్మాండ:
శరన్నవరాత్రుల్లో అమ్మవారి నాల్గవ అవతారం కూష్మాండ. అనగా, బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజములతో విరాజిల్లుతుండటం వలన ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.
శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

5. స్కందమాత:
అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా చేస్తూ ఆ తల్లి ఉద్ధరిస్తుందనటానికి సంకేతమే ఇది.
శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా |
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||
6. కాత్యాయని:
శరన్నవరాత్రుల్లో దుర్గామాత ఆరవ అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే ఋషి తనకు పార్వతీదేవి కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశారు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలు అందుకుని విజయదశమి రోజున మహిషాసురుణ్ని వధిస్తుంది.
శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||
7. కాళరాత్రి:
శరన్నవరాత్రుల్లో దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.
శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ ||
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా |
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||
8. మహాగౌరి :
శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దానివల్ల ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతుల వలే వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధికెక్కింది.
శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||
9. సిద్ధిధాత్రి:
శరన్నవరాత్రుల్లో దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు వెల్లడిస్తున్నాయ్.
శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||