యక్ష ప్రశ్నలు
సాధారణముగా జవాబు చెప్పటానికి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎవరైనా వేస్తుంటే మనము “వీడి యక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పటం కష్టము” లేదా యక్ష ప్రశ్నలతో విసిగిస్తున్నాడు” అని అంటాము అసలు ఈ యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని అడిగారు వాటికి సమాధానాలు ఏమిటి? అనే విషయము గురించి క్లుప్తముగా తెలుసుకుందాము.
దేవలోకములో ఉండే వారిని గంధర్వులు యక్షులు అని అంటారు. అటువంటి ఒక యక్షుడు అరణ్యవాసము చేస్తున్న పాండవులను ముఖ్యముగా ధర్మరాజును అడిగిన ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు ఈ యక్షప్రశ్నలాగా చెలామణి అవుతున్నాయి. వీటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు చాలా మటుకు ధర్మానికి సంబంధించినవి. అందువల్ల ఈ జవాబూల్లో ధర్మరాజు విజ్ఞతని ధర్మనిరతి తెలుస్తుంది.
పాండవులు అరణ్యవాసము చేసేటప్పుడు ప్రకృతి రమణీయమైన ద్వైతవనములో ఉంటారు. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వీరివద్దకు సహాయము కొరకు వస్తాడు. ఆ బ్రాహ్మణుడు తాను చేస్తున్న హోమానికి సంబంధించిన సమిధలను (చిన్న కట్టెపుల్లలను) ఒక జింక తన కొమ్ముల మధ్య ఇరికించుకుని ఆ బ్రాహ్మణుడికి దొరకకుండా పారిపోతుంది కాబట్టి ఆ బ్రాహ్మణుడు చేసే దైవకార్యము హోమము ఆగిపోతుంది. అందువల్ల పాండవులు ఆ జింక నుండి తన కట్టెలను ఇప్పించ వలసిందిగా వేడుకుంటాడు. పాండవులు ఐదుగురు ఆయుధాలతో జింక కోసము బయలుదేరుతారు. ఈ వేటలో పాండవులు అలిసిపోతారు కానీ వారికి జింక జాడ కనిపించదు. అలసిన పాండవులు దాహము తీర్చుకోవటానికి కొంచెముసేపు ఆగి, నకులుడిని మంచినీటి కోసము పంపుతారు. నకులుడు మంచినీటి సరస్సు కోసము వెతికి, చివరకు ఒక మంచి నీటి సరస్సును చూస్తాడు. తానూ మంచినీరు త్రాగి సోదరులకు మంచి నీరు తీసుకొనివెళదామని సరస్సు చెంతకు వెళతాడు.
నకులునికి ఆ నీరు త్రాగవద్దని అశరీరవాణి వినిపిస్తుంది కానీ నకులుడు ఆ మాటలను లెక్కచేయకుండా త్రాగటంవల్ల చనిపోతాడు.
ఒకరితరువాత ఒకరు నీటికోసము సరస్సు వద్దకు వచ్చి అశరీరవాణి మాటలను లెక్కచేయకుండా నీరు త్రాగి చచ్చి పడిపోతారు. చివరకు ధర్మరాజు సోదరులను వెతుక్కుంటూ వచ్చి చచ్చి పడివున్న సోదరులను చూసి ఆశ్చర్యపోతాడు. నీరు త్రాగటానికి ప్రయత్నించినప్పుడు ధర్మరాజుకు అశరీరవాణి వినిపిస్తుంది. ఆ వాణి ఒక యక్షుడిది. ఆ యక్షుడు ధర్మరాజును తన ప్రశ్నలకు జవాబులు చెపితే నీరు త్రాగి తన సోదరులను సజీవంగా తీసుకొని పోవచ్చని చెపుతాడు. ఆ యక్షుడు అడిగిన దాదాపు వంద ప్రశ్నలు ధర్మానికి నీతికి, సక్రమమైన నడవడికి సంబంధించినవి ధర్మాన్ని ఆచరించే ధర్మరాజులాంటి వాడు మాత్రమే ఆ ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలిగాడు.
మనము అన్ని ప్రశ్నలు జవాబులు కాకపోయినా కొన్ని ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు తెలుసుకుందాము.
1.ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? జ:-అహింస
2.సుఖాల్లో గొప్పది ఏది? జ:-సంతోషము.
3.సుఖానికి ఆధారము ఏది ? జ:-శీలము.
4. ధర్మానికి ఆధారము ఏది? జ:-దయా దాక్షిణ్యము.
5. ఎవరు స్థితప్రజ్ఞుడు? జ:-కలిమిలేములలో సుఖ దుఃఖాలలో ఒకే రీతిగా ఉంటూ లభించిన దానితో సంతృప్తుడై అరిషద్ వర్గాలను జయించి స్థిరబుద్ధి కలవాడు స్థితప్రజ్ఞుడు .
6.ఆశ్చర్యాన్ని కలిగించేది ఏది? జ:-ప్రతిరోజూ మరణిస్తున్న ప్రాణులననేకము చూస్తూ కూడా మనిషి తానూ శాశ్వతముగా ఈ భూమి మీద ఉంటానని అనుకోవటం.
7. ధర్మము,అర్ధము,కామము ఎక్కడ కలియును? జ:-తన భార్యలో,తన భర్తలో.
8. నరకము అనుభవించేవారు ఎవరు? జ:-వేదాలను,ధర్మ శాస్త్రాలను,దేవతలను,తల్లిదండ్రులను ద్వేషించేవారు,దానములు చేయనివారు,ఆశ పెట్టి దానము చేయనివారు నరకము అనుభవిస్తారు.
9. ఎవరు సంతోషముగా ఉంటారు?-జ: తనకున్న దానితో తృప్తి చెందేవాడు,అప్పు లేనివాడు సంతోషముగా జీవించగలడు.
10. లోకములో ధనవంతుడెవరు ? జ;-సుఖము,దుఃఖము,ప్రియము అప్రియము మొదలైన వాటిని సమముగా చూసేవాడే ధనవంతుడు.
11. బ్రాహ్మణత్వము ఇచ్చేది ఏది ? జ;- వ్యక్తి యొక్క సత్ప్రవర్తన మాత్రమే బ్రాహ్మణత్వాన్ని ఇస్తుంది.
12. పండితు డని ఎవరిని అంటారు?. జ:- ధర్మమూ తెలిసిన వాడిని మాత్రమే పండితుడని అంటారు .
13.మూర్ఖుడు ఎవడు? జ:-ధర్మము తెలుసుకోకుండా అడ్డదిడ్డముగా వాదించేవాడు.
14.జీవన్ మృతుడు ఎవరు ? జ:-అతిధులకు, పితృ సేవాకాదులకు ,దేవతలకు పెట్టకుండా తానూ తినేవాడు జీవన్ మృతుడు
15. గాలి కంటే వేగముగా ప్రయాణించేది ఏది? జ:-మన మనస్సు,
16. బాటసారికి, రోగికి, గృహస్తుకు బంధువులెవరు? జ:-బాటసారికి స్వార్ధము , రోగికి వైద్యుడు,గృహస్తుకు అనుకూలవటి,శీలవతి అయిన భార్య,చనిపోయిన వారికి వారి సుకర్మ బంధువులు.
17. మానవునికి సజ్జనత్వము ఎలా వస్తుంది? జ:-ఇతరులు తన పట్ల ఏమి మాట్లాడితే ,ఏమి పనిచేస్తే తానూ శారీరకంగా మానసికముగా భాధ పడతాడో తానూ కూడా ఇతరులపట్ల అటువంటి పనులుచేయకుండా మాటలు మాట్లాడకుండా ఎవరు ఉంటారో నట్టివారికి సజ్జనత్వము వస్తుంది.
18. మానవునికి దుర్జనత్వము ఎలా వస్తుంది? జ:-శరణు జొచ్చిన వారిని రక్షించకపోవటము వలన.
19. దేవ లోకానికి దారి ఏది? జ;- సత్యము.
20. మనిషికి దైవిక బంధువులు ఎవరు? జ:-భార్య/భర్త..
21. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? జ:-తపస్సు వలన సాధుభావము శిష్టాచారా భ్రష్టతనము వల్ల .
22. మంచిగా మాట్లాడేవానికీ ఏమి దొరుకుతుంది? జ:-మైత్రి.
23.. అలోచించి పనిచేసేవారు ఏమి అవుతారు? జ:-అందరి ప్రశంసలు పొందిగొప్పవారు అవుతారు.
24.మానవునికి దుర్జనత్వము ఎలా వస్తుంది? జ:- శరణు జొచ్చిన వారిని రక్షించకపోవటం వలన
25. జన్మించియు ప్రాణము లేనిది ? జ:- గ్రుడ్డు
26. తృణము కంటే దట్టము అయినది ఏది? జ:- చింత
27. మానవుడు దేని వలన శ్రోత్రియుడు అగును? జ:- వేదము వలన.
28. మానవుడు దేనివలన మహత్తును పొందుతాడు ? జ:- తపస్సు వలన.
29. మానవుడు దేని వలన బుద్ధిమంతుడవుతాడు? జ::- పెద్దలను సేవించటం వలన.
30. రూపము ఉన్నా హృదయము లేనిది ఏది? జ:- రాయి.
31. తపస్సు అంటే ఏమిటి?జ:-తన వృత్తి, కుల ధర్మాలను ఆచరించటం.
32. సిగ్గు అంటే ఏమిటి? జ:- చేయరాని పనులు చేయటానికి సంకోచించటము.
33.సోమరితనం అంటే ఏమిటీ? జ:- ధర్మ కార్యాలు చేయకపోవటం.
34. ధైర్యము అంటే ఏమిటి? జ:-ఇంద్రియ నిగ్రహము.
35. లోకాన్ని కప్పిఉన్నది ఏది? జ:- అజ్ఞానము .