తెలుగు, పూజలు-వ్రతాలు

గంగావతరణం – దశపాపహర దశమి

గంగావతరణం – దశపాపహర దశమి
Views: 7

హిందువుల జీవన సంస్కృతిలో ప్రకృతి ఒక భాగం. భారతదేశంలో నదులను దేవతలుగా పూజిస్తారు. ముఖ్యంగా హిందూ ధర్మంలో గంగా నదికి ఒక విశిష్ట స్థానం ఉంది. భారతీయ సంస్కృతిలో ఈరోజు ప్రాధాన్యత విశేషమైనది. భక్తుల నమ్మకాన్ని, పూర్వీకుల విశ్వాసాన్ని ప్రతిబింబించే ఈ పవిత్ర దినం పాప విమోచనానికి పుణ్యార్జనకు ద్వారంగా నిలుస్తుంది. గంగాదేవి భూలోకానికి అవతరించిన రోజు కనుక ఈ రోజుని ” దశ పాపహర దశమి” అని పిలుస్తారు. శాస్త్ర సహితంగా కొన్ని విధులను పాటించడం ద్వారా పది రకములైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది ., కాబట్టి ఈరోజుని ” దశపాపహర దశమి ” అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఈ గంగను భగీరధుడు భూమికి తీసుకువచ్చిన రోజే ‘ జేష్ఠమాసం – శుక్లపక్ష దశమి’ అని కొన్ని పురాణాల ద్వారా తెలుస్తోంది. అవి స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, స్కాంద పురాణంతో పాటు కొన్ని పురాణాలు , మహాభారతంలో గాంగేయుని వృత్తాంతం ద్వారా కూడా గంగా అవతరణ దినోత్సవం వర్ణించడం జరిగింది. గంగా మాతని స్కాంద పురాణం ఇలా ప్రస్తుతిస్తుంది.

” జేష్ఠమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా హరతే దశపాపాని తస్మార్థశ హరా స్మృతా!”

అనగా ఈ రోజున చేసే గంగా స్నానం, పూజ పది రకాలైన పాపాల నుండి మానవులకి విముక్తిని కలిగిస్తుందని అర్థం.

గంగా వ్రతం

పౌరాణిక ప్రాముఖ్యత

పురాణాల ప్రకారం, భగీరథ మహారాజు తన పితృవంశానికి మోక్షం కలిగించాలని తీవ్రమైన తపస్సు చేశారు. ఆనాటి భగీరధుని తపః ఫలితంగా హస్తా నక్షత్ర సమయంలో జేష్ఠ మాస శుక్లపక్ష దశమి తిథిన గంగాదేవి భూలోకానికి ఏతెంచింది. భూమిపై గంగా ప్రవాహం వలన భూలోకం నిందల నుండి విముక్తి పొందిందని విశ్వాసం. శివుడు తన జటా జూటాల్లో గంగను స్వీకరించి భూమిపైకి వదలడం వల్ల గంగమ్మ శక్తి నియంత్రితంగా ప్రవహించగలిగింది.

లోకంలో మానవులు తెలిసి తెలియక చేసే పాపాల వల్ల కర్మ ఫలాలను అనుభవిస్తారు. చెడు కర్మలు అనుభవించేటప్పుడు , ఆ బాధల్ని తొలగించుకోవడానికి శాస్త్రానుసారం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మన పూర్వీకులు శాస్త్రాల రూపంలో పాపపు కర్మల నుంచి విముక్తి పొందే మార్గాలను అందించారు. వాటిని ఆచరించి విముక్తి పొందే వ్రతమే ఈ ‘దశ పాపహర దశమి వ్రతం ‘ అని వ్రతనిర్ణయకల్పవల్లి అనే గ్రంథం తెలియజేస్తుంది. ఈ వ్రతంలో ప్రధాన ఘట్టం ‘ నదీ స్నానం ‘. ఈ వ్రతాన్ని వాస్తవానికి జ్యేష్ట శుద్ధ పాడ్యమి నుండి దశమి తిథి వరకు ఆచరించాల్సి ఉంటుంది. అలా కుదరని పక్షంలో ఒక్క రోజుకే- చివరి రోజు అయిన దశమి తిథి రోజున పాటించాల్సి ఉంటుంది. ఈ రోజున కాశీ క్షేత్రంలోని దశాశ్వమేథ ఘాట్లో చేసే గంగా స్నానం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలా కుదరని పక్షంలో మరేదైనా నదిలో కానీ, చెరువులో కానీ లేదా కనీసం ఇంటిలోని బావి వద్ద అయినా భక్తిశ్రద్ధలతో గంగా స్తోత్రంతో స్నానమాచరించిన ఫలితం దక్కుతుంది.

వ్రత విధానం

స్కాంద పురాణం అనుసరించి ఈ రోజున ప్రతిమ గాని , కలశం గానీ ప్రతిష్టించి అందు గంగామాతను ఆవాహన చేసి పూజించాలి . తెల్లని వస్త్రాలను ఆ దేవికి సమర్పించి గంగా స్తోత్రం ని పటించాలి. ఆ తరువాత నారాయణుని గాని, పరమేశ్వరుని గాని పూజించాలి.

స్నానం చేసే సమయంలో పఠించాల్సిన శ్లోకం:

” మమ ఏతజ్జన్మ జన్మాంతర సమూద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నాన మహం కరిష్యే!”
అని సంకల్పం చెప్పి స్నానం ఆచరించాలి. అనంతరం పితృ తర్పణాలు, నిత్యానుష్టాలను యథావిధిగా చేయాలి. తరువాత తీర్థ పూజ చేయాలి. పూజలో ‘‘నమశ్శివాయైు, నారాయణ్యై, దశపాపహరాయైు, గంగాయైు!’’ అనే మంత్రం చెబుతూ నారాయణుణ్ణీ, రుద్రుణ్ణీ, బ్రహ్మనూ, సూర్యుణ్ణీ, భగీరథుణ్ణీ, హిమవంతుణ్ణీ ఆవాహన చేసి, షోడశ ఉపచారాలతో పూజించాలని శాస్త్రవాక్కు.

దశపాపహర వ్రతం చేయడానికి వీలుకానివారు గంగామాత ద్వాదశనామాలు- ‘‘నందినీ, నళినీ, సీతా, మాలినీ, మహాపగా, విష్ణు పాదాబ్జ సంభూతా, గంగా, త్రిపథగామినీ, భాగీరథీ, భోగవతీ, జాహ్నవీ, త్రిదశేశ్వరి’’ అనే పన్నెండు నామాలను తలచుకుని అందుబాటులో ఉన్న జలవనరులలో మునకలు వేసిన గంగానదీ స్నానాన్నీ, వ్రతాన్నీ ఆచరిస్తే ఎంత ఫలితం ఉంటుందో అందుకు సమానమైన ఫలితం పొందుతారని శాస్త్రం చెబుతుంది.

ఏమిటా దశ పాపాలు?

ఈ పది రకాలైన పాపాలను మానవులు తమ నిత్య జీవితంలో మనసా , వాచా , కర్మణా చేస్తూనే ఉంటారు.

  1. పరదార గమనం – ఇతరుల భార్యలతో/భర్తలతో అనైతిక సంబంధాలు.
  2. బ్రహ్మహత్య – బ్రాహ్మణుడిని లేదా జ్ఞానవంతుడిని హత్య చేయడం.
  3. సూర్య గ్రహణ సమయమున పాపకర్మలు చేయడం – గ్రహణ సమయాల్లో పవిత్రత పాటించకుండా పాపకార్యాల్లో పాల్గొనడం.
  4. అన్యాయంగా ద్రవ్య సంపాదన – ఇతరుల ఆస్తిని హింసతో లేదా మోసంతో స్వాధీనం చేసుకోవడం.
  5. పరుష వచనాలు – ఇతరులను గాయపరిచే రీతిలో మాట్లాడడం.
  6. అన్యాయంగా ఇతరులను హింసించటం – శారీరకంగా, మానసికంగా హింసించడం.
  7. సత్యాన్ని దాచడం / అబద్ధం చెప్పడం – ధర్మం కోసం అవసరమైన సత్యాన్ని దాచిపెట్టడం లేదా అబద్ధంగా ప్రసంగించడం.
  8. దైవ నింద – దేవుళ్లను, వేదాలను, ధర్మాలను నిందించడం.
  9. పితృ, గురు, మాతృ ధర్మాలను విస్మరించడం – తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం ఇవ్వకపోవడం.
  10. ధర్మ విరుద్ధమైన జీవనం – శ్రద్ధ లేకుండా, విధి తప్పుగా, అవినీతితో జీవించడం.

గంగా వ్రతం ఫలితాలు

ఈ రోజున గంగానదిలో స్నానం చేసి పూజలు చేస్తే, పది రకాల పాపాలు హరించబడతాయని పురాణాలు చెబుతున్నాయి. శరీరశుద్ధి మాత్రమే కాదు, మనస్సు కూడా పవిత్రమవుతుందని విశ్వాసం. ధర్మాన్ని పాటించాలనే స్పూర్తిని కలిగించేది ఈ రోజు.

ఉపసంహారం

గంగా దశమి మనం గతాన్ని గుర్తు చేసుకుంటూ భక్తితో నడుచుకునే దినం మాత్రమే కాదు, మన ఆధ్యాత్మిక జీవనంలో ఒక వెలుగు. ఈ పవిత్ర దినాన, మనల్ని మనం శుద్ధపర్చుకునే అవకాశం కలుగుతుంది. మన పూర్వీకులు చెప్పిన విలువలు, ధర్మం, భక్తి భావనలను గుర్తుచేసే గంగాదశమీ రోజు మనందరికీ పుణ్యమయంగా మారాలని కోరుకుందాం.

What’s your response?
0 responses
Love
Love
0
Smile
Smile
0
Haha
Haha
0
Sad
Sad
0
Star
Star
0
Weary
Weary
0

Leave a Reply