సంకటహర చతుర్థి ప్రాముఖ్యత వ్రత విధానం వ్రత కథ

“సంకటహర చతుర్థి” అనగా మనుషుల కష్టాల బారి నుంచి ఉపశమనం కలిగించేందుకు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ముఖ్యమైనది చతుర్థి. ఈ వ్రతాన్ని మహిళలు చాలా ప్రత్యేకంగా చూస్తారు. పూజలు, నోములు మరియు శుభకార్యాలతో సందడి చేస్తుంటారు. పైగా ఎంతో పవిత్రమైనదిగా భావించే సంకటహర చతుర్ధికి భక్తులంతా వ్రతాన్ని ఆచరించేందుకు సిద్ధమవుతారు.
సంకష్టహరుని పరిచయం
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే.
హిందూ దేవుల్లలో ఎంతో ప్రసిద్ధి చెందిన, బాగా ఆరాధించబడుతున్న దైవం మరియు గజ రూపంలో కనిపించే స్వరూపమే ఈ గణేశుడు.
విఘ్నేశ్వరుడిని ఆపదలను హరించేవాడిగా మరియు శాస్త్రాలకు, కళలకు మూలాధిపతిగా, జ్ఞానానికి, బుద్ధికి ఆరాధ్య దైవంగా భావించి ప్రజలు పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఇంకా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు క్రతువుల్లో, పూజల్లోను ప్రథమ పూజగా విఘ్నేశ్వరునికి చేస్తుంటాము. మనిషి జీవితంలో విద్యను ఆరంభించేటప్పుడు చేసే అక్షరాభ్యాసంలోను వినాయకుని పూజిస్తాము. గణాపత్యంలో విఘ్నేశ్వరుడు సర్వోత్కృష్టమైన దైవం.
విఘ్నేశ్వరుని వివరించే ముఖ్యమైన గ్రంథాలు ముద్గల పురాణం, గణేశ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణము, గణపతి అధర్వశీర్షం, ఇవి కాక మరో 2 విజ్ఞాన, పౌరాణిక శాస్త్రాలు ముఖ్యమైనవిగా ఉన్నాయి. మనం నిత్య పూజలో భాగంగా చేసే ఆరాధన మాత్రమే కాకుండా గణపతికి సంబంధించి రెండు పండుగలు ప్రముఖంగా జరుపుకొంటాము. అవి…..
- మాఘ కృష్ణ చతుర్థి నాడు (జనవరి / ఫిబ్రవరి మాసములలో) వచ్చే వినాయక జయంతి.
- భాద్రపద శుద్ధ చతుర్థి నాడు (ఆగస్టు / సెప్టెంబరు మాసములలో) వచ్చే వినాయక చవితి.
సంకటహర చతుర్థి వ్రతం ప్రాముఖ్యత
ఈ సంకటహర చతుర్థి పండగ విషయానికి వస్తే ప్రతి చాంద్రమాసంలో వచ్చే గణేశుడి ఉత్సవమే ఈ సంకటహర చతుర్థి.
ప్రతి మాసంలో కృష్ణ పక్షoలో వచ్చే చతుర్థిని విఘ్నేశ్వర పూజకు శుభప్రదంగా భావిస్తారు. సంకట అంటే బాధ లేదా అడ్డంకి మరియు హర అంటే నాశనం చేయడం. అనగా మానవులు తమ జీవనయానంలో ఎదుర్కొనే కష్టాల నుండి బయటపడడానికి చేసే వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతం.
విఘ్నేశ్వరునికి ప్రీతికరమైన తిథులలో ముఖ్యమైనది ఈ చతుర్థి తిథి . ఈ చతుర్థి పూజలను రెండు రకాలుగా ఆచరిస్తారు. అవి వరద చతుర్థి మరియు సంకష్టహర చతుర్థి . అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతం అంటారు. వరద చతుర్థిని వినాయక చవితి రోజున వినాయక వ్రతంగా జరుపుకుంటారు. సంకటములను హరించే సంకటహర చతుర్థి వ్రతమును ఆలంబనగా ఆచరిస్తున్నారు.
సంకష్టహర వ్రత విధానాన్ని తెలుసుకుందాం
ప్రతి మాసంలో కృష్ణపక్షములో పౌర్ణమి పిదప 3 లేక 4 రోజులలో చతుర్థి తిథి వస్తుంది. అనగా ప్రదోషకాల సమయమునకు చవితి తిధి కనుక ఉంటే ఆ రోజుని సంకష్ట హర చతుర్థిగా భావించాలి.
- ఈ సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 9, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు.
- ఈ వ్రతాన్ని బహుళపక్షంలో వచ్చు చవితి నాడు ప్రారంభించాలి.
- వ్రతం సంకల్పించిన రోజున ప్రాతఃకాలంనకు ముందే లేచి తలస్నానం చేసి శుచియై, స్వామి వారిని పసుపు కుంకుమలతో అలంకరించిన పీటమీద వినాయకుని ప్రతిమను ప్రతిష్టించి షోడశోపచారాలతో పూజించాలి.
- తర్వాత ఎరుపు లేదా తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని వినాయకుని ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరించాలి.
- మనసులో మన కోరిక ఏదైతే ఉందో అది తలుచుకొని 3 గుప్పిల్ల బియ్యాన్ని వస్త్రంలో పోసి అందులో ఒక తమలపాకు, 2 లేదా 5 ఎండు ఖర్జూరాలు, 2 లేదా 5 వక్కలు, 11 రూపాయలు దక్షిణ పెట్టి మరొకమారు కోరికని మనసులో తలంచి స్వామివారికి చెప్పుకుని ముడుపు కట్టుకోవాలి. సాయంత్రం పూజ ముగిసే వరకు ఉపవాసం ఉండాలి.
- తరువాత వినాయకునికి అంగపూజ, ఏకవింశతి పుష్ప పూజ, ఏకవింశతి పత్ర పూజ , అష్టోత్తర శతనామావళి, సంకట నాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రతం కథను చదువకోవలెను.
- తరువాత ఆ ముడుపు మూటను స్వామివారి ముందుంచి ధూప- దీపాలతో పూజించి, కొబ్బరికాయ లేదా అరటి పళ్ళను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి.
- తరువాత సాయంత్రం వేళ విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లి 3 లేక 11, 21 ప్రదక్షిణలు చేయాలి.
- విఘ్నేశ్వరునికి గరికను సమర్పిస్తే ఎంతో ప్రీతి చెందుతాడు. కనుక గరికను సమర్పించాలి. స్తోమతను అనుసరించి గరిక పూజను కానీ, వినాయకుని హోమాన్ని కానీ చేయించుకోవచ్చు.
- సూర్యాస్తమయం అయ్యే వరకు పూజ చేసిన గణపతిని ఎంత మాత్రమూ కదపరాదు.
- సూర్యాస్తమయం తర్వాత మరలా స్నానం చేసి ఆ స్వామికి దీపం వెలిగించి నిత్య పూజ చేసినట్లు చేయాలి. నియమానుసారం పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి నివేదన చేయాలి.
- సంకష్టహర వ్రత కథను చదువుకొని , పూజ అక్షింతలను తలపైన వేసుకోవాలి.
- భక్తులు రాత్రి చంద్రుని దర్శనం చేసుకుని పిదప చంద్రుని ముందు స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమిస్తారు.
విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం కోసం గణపతి యొక్క అధర్వ శీర్షాన్ని చదువుతారు.
సంకటహర చతుర్థి వ్రత కథ
ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాకా ఇలా కోరారు. “స్వామీ కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి, తత్ఫలితముగా ఋణ బాధలు, సంతానలేమి, గృహ వసతి లేకపోవుట, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, వలసినంత ధనం లేకుండుట, శతృపీడ, పనులలో ఆటంకాలూ, అభివృధ్ధి లేకపోవుట, పాడిపంటల సరిగ్గా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చెయ్యని తప్పుకి నిందలు మరియు దండన అనుభవించుట” మొదలైనవి ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చే వ్రతరాజమేదైనా ఉంటే సెలవీయండి అని స్కందుని అడిగారు.
అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై “వ్రతాలలోకెల్లా అత్యంత శక్తిమంతమైన సంకష్ట హరచతుర్థి వ్రతాన్ని మీకు 1ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి, శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకూ ఫలితమందక బాధపడుచూ, తన పూర్వపు అవతారాలలో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది.
ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ” ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా, బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థీ తిథి ఉన్న రోజు చూసుకొని,
ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని, కాల కృత్యాలు తీర్చుకొని, నల్లటిను వ్వులతో కూడిన నీటితో స్నానం చేసి, సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి, సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని, ఎరుపు రవికెల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపూ కుంకుమ వేసి, మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోసి, ఎండుఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణతో గూడిన తాంబూలము అందులో వుంచాలి. మనసులో వున్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా వుండాలి. మనసులో గణపతి నామ స్మరణ చేస్తుండాలి సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి, శ్రీ సంకష్ట హర చతుర్జి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములూ చేసి స్వామికి నివేదించాలి. వ్రతమూ అర్ఘ్యాలూ అయిన పిదప అతిధులని గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి. ఆ ముందు రోజూ ఆ రోజూ బ్రహ్మ చర్యాన్ని పాటించి, దైవ నామ స్మరణతో, లౌకిక విషయాలమీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి. 12 సార్లు ఛేసే ఈ వ్రతానికి వ్రత సిధ్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం.
భృశుండి మహర్షి వృత్తాంతం
ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తూన్న నారద మహర్షికి, కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా? అని చూసాడు అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరక యాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూన్న మహర్షి వద్దకు వెళ్ళి, “ఓ మహర్షీ! నీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చేయి” అని చెప్పి వెళ్లిపోయాడు.
నారదుడి మాటలు విన్న భృశుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈ నాడు తపస్వినయ్యాను, ఎలాగైనా వారి బాధల్ని రూపు మాపాలని సంకల్పించాడు. తన ఇష్ట దైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తనవారికి ధారపోయాలని అనుకొని, ఓ గణనాధా! నేనే గనుక నీ దివ్యచతుర్థీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి వుంటే, నా పితరులు, వారితోపాటు నా భార్య, కుమారుడు నరకలోక బాధల నుంచి నిముక్తి పొందుదురు గాక! అని నీళ్ళు విడిచి పెట్టాడు. గజాననుడి అనుగ్రహముతో అయన చేసిన వ్రతాలల్లో, ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే, ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాల్ని ధరించి, దివ్యవిమానం ఎక్కి గణేశ లోకానికి చేరుకున్నారు.
ఇక ప్రతీ మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్ప తరమా?
ఈ కథలు సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యతను, ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట హర చవితి వ్రత ఫలితాన్ని తెలియజేస్తున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు జన్మాంతరంలో విఘ్నేశ్వరుని లోకానికి చేరుతారు. ఆ దైవం ఆశీస్సులతో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు.
శ్రీ గణేశాయ నమః స్వస్తి 🙏