హోలీ రంగులు సహజంగా పువ్వులతో ఇలా తయారు చేసుకోండి

హోలీ రంగులు సహజంగా పువ్వులతో ఇలా తయారు చేసుకోండి. హోలీ పండుగ జరుపుకునే సంప్రదాయం మనకు పురాతన కాలం నుంచి వస్తుంది. అయితే ఆ కాలంలో ప్రకృతి ప్రసాదించే రంగులతో హోలీ పండుగను జరుపుకొనేవారు, కానీ ప్రస్తుతం మార్కెట్ లో సింథటిక్ రంగులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఆ రంగులు సులువుగా లభిస్తాయి కానీ హానికరమైన రసాయనాలను వాడి తయారు చెయ్యడం వలన చర్మానికి మరియు ఆరోగ్యానికి చాలా హానికరం.
హోలీ రంగులు సహజంగా పువ్వులతో ఇలా తయారు చేసుకోండి
ప్రభుత్వంవారు ఈ రసాయన రంగుల్ని వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదని చెబుతున్నా కూడా ప్రజలు వినకపోవడం బాధాకరం. ఎందుకంటే కృత్రిమ రంగులతో పోలిస్తే మార్కెట్లో ఆర్గనిక్ కలర్ పౌడర్ల రేట్లు చాలా ఎక్కువగా ఉండడం. మరొక సమస్య ఏంటంటే, అవి నిజంగా ఆర్గనిక్కేనా అనేది మనకు తెలీదు. కనుక కొంచెం ఒపికతో ఇంట్లోనే ఎవరికి వాళ్లు సహజమైన రంగుల్ని తయారు చేసుకోవడం ఎంతో ఉత్తమం. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఎల్లో / పసుపు రంగు కోసం
ఈ పసుపు రంగును తయారు చెయ్యడం కొంచెం ఓపికతో చెయ్యాల్సిన పని. బంతి పువ్వులు 50 గ్రాములు, పొడి చేసిన నారింజ తొక్కలు 20 గ్రాములు, చేమగడ్డ పొడి 200 గ్రాములు, పసుపు 100 గ్రాములు, నిమ్మ రసం 20 చుక్కలు తీసుకుని, ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే మెత్తటి పసుపు రంగు తయారవుతుంది.
రెడ్ / ఎరుపు రంగు కోసం
మందార పువ్వులను కడిగి ఎండలో తడి పోయేవరకు ఆరబెట్టాలి. ఎండిన తర్వాత మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇక ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఒకవేళ ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే ఈ మందారపువ్వు పొడిలో కొంచెం బియ్యప్పిండిని కలిపితే సరిపోతుంది. మందార పువ్వుతో పాటు ఎర్ర చందనం పౌడర్ ని కలిపి కూడా ఎరుపు రంగుని తయారు చేసుకోవచ్చు. ఎర్ర చందనం మన శరీరానికి మంచి రంగునిస్తుంది. దీనిని తడి లేదా పొడి రంగుగా వాడవచ్చు. లీటర్ నీళ్లలో రెండు చెంచాల ఎర్ర చందనం పొడిని కలిపి దగ్గరికి అయ్యే వరకు మరగనిచ్చి, చల్లారాక కొన్ని నీళ్లు కలిపితే తడి రంగుగా మారుతుంది.
బ్రౌన్ / గోధుమ రంగు కోసం
గోరింటాకుని పొడిగా చేసి ఒక భాగం తీసుకుని, అందులో నాలుగు పార్ల ఉసిరి పొడిని కలపిన తర్వాత మిశ్రమాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు అంటే బ్రౌన్ కలర్ గా తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పొడుల మిశ్రమంలో బియ్యప్పిండిని కలిపితే చాలు.
బ్లూ / నీలం రంగు కోసం
సూర్యకాంతిలో ఇసుక నేలల్లో ఎక్కువగా ఎదిగే చెట్లు జకరండ అనగా నీలి గుల్మహార్. వీటి పువ్వులు నీలి మరియు ఊదా రంగుల్లో ఉంటాయి. వీటిని ఎండబెట్టి ద్వారా నీలి రంగును తయారు చేసుకోవచ్చు. కేరళ ప్రాంతాల్లో అయితే నీలి మందారం మొక్కల వాడి సహజసిద్ధమైన రంగుల్ని తయారుచేస్తారు. తడి రంగు కొరకు నీలిమందు చెట్ల కాయల్ని అనగా జెర్రీలను పొడి చేసి నీళ్లలో కలపాలి. కొన్ని జాతుల యొక్క నీలిమందు చెట్ల ఆకులు కూడా నీలం రంగుల్లోనే ఉంటాయి. వాటిని కూడా నీటిలో కలిపి నీలం రంగును తయారుచేసుకోవచ్చు.
గ్రీన్ / ఆకుపచ్చ రంగు కోసం
కావలసినంత గోరింటాకు పొడిలో బియ్యప్పిండిని కలిపి గ్రీన్ కలర్ ను తయారు చెయ్యవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కగా చెయ్యాలి. పై పై నీటిని వడబోసాక మిగిలిన నీటిని తడి ఆకుపచ్చ రంగుగా వాడుకోవచ్చు.
ఆరెంజ్/కాషాయం రంగు కోసం
మోదుగ పువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి లేదా నీటిలో వేసి మరగబెట్టినా సరిపోతుంది. పసుపు, కాషాయం రంగుల మిశ్రమంతో రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్నఈ మోదుగ పువ్వులను ఎండబెట్టి నూరుకుని పొడి రంగుగా తయారు చేసుకోవచ్చు. మైదాకును నీటిలో కలిపి కాషాయ (ఆరెంజ్) రంగుగా తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును రాత్రంతా నీటిలో నానబెడితే చాలు తెల్లారేసరికల్లా కాషాయం రంగు తయారవుతుంది. కాకపోతే ఇది ఖరీదైన పని.
పింక్/గులాబీ రంగు కోసం
పసుపు రంగు మందార పువ్వులు మరియు బీట్ రూట్ ద్వారా సహజమైన పింక్ రంగును తయారు చేసుకోవచ్చు. బీట్ రూట్ ని బాగా నూరితే పేస్టుగా మారుతుంది.. ఆ పేస్ట్ ని ఎండలో నానబెట్టాలి. ఎక్కువ రంగు కావాలనుకుంటే ఆ పొడిలో కొంచెం శెనగ లేదా గోధుమ పిండిని కలిపితే సరిపోతుంది. తడి రంగు కావాలంటే బీట్ రూట్ ముక్కలను నీటిలో మరగబెట్టి చల్లార్చాలి.
హోలీ రంగులు సహజంగా పువ్వులతో ఇలా తయారు చేసుకోండి