సకల దేవతా స్వరూపిణి “గోమాత”
“సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం
సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం”
సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని, వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని, గోమాత యజ్ఞమునకు తల్లి వంటిదని ఈ శ్లోకం అర్థం. గోమాత సర్వ శుభ రూపిణి. ముక్కోటి దేవతలకు నిలయం గోమాత.
హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మొదలైనవాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమగు వస్తుజాతకమును అగ్నినుండి ఉత్పన్నం చేయాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వల్ల గోవు ఒక్కటే అందునుంచి ఆవిర్భవించింది. అగ్ని సంబంధమైన హోమం వల్ల గోవు జన్మించడంతో, గోవు అగ్నిహోత్ర సమానమైంది.
గోమాతలో సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని అంటారు. యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ వుంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తుంటారు.
గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు. గోవులో వివిధ భాగాల్లో వున్న దేవదేవతల వివరాలను ఓ సారి పరిశీలిస్తే… గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే, త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ, బిళ్వ దళాలతో పూజిస్తే, సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందట. గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం వుండదట, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారట, అందువల్ల చెవిని పూజిస్తే, సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు వుంటారట, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయట. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతారు.అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే, విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని, కనుక వాటిని పూజిస్తేయమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడట, అందువల్ల కంటాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే, ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే,నాగలోక ప్రాప్తి లభిస్తుందని, భూమిపై నాగుపాముల భయం ఉండదని చెపుతారు. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారట. కనుక గిట్టలను పూజిస్తే, గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారట, ఆ భాగాన్ని పూజిస్తే, సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.
గోవును ప్రతి దినం పూజించవచ్చు. అయినప్పటికీ, గో పూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులు కూడా వున్నాయి. ఈ తిథుల్లో పూజించడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటిగా ‘ఆశ్వయుజ బహుళ ద్వాదశి’ కనిపిస్తుంది. దీనినే ‘గోవత్స ద్వాదశి’ అని కూడా అంటారు. ఈ రోజున దూడతో కూడిన గోవుని పూజించాలని పండితులు అంటున్నారు. ఈ రోజున ఆవు, దూడలను పసుపు కుంకుమలతో, పూల దండలతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో చేసిన వంటకాలను ఈ రోజున స్వీకరించరాదనే నియమం ఉంది. దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్లు ఆ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై పడుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయట.
గోమాతను దానం చేస్తే, కోటి పుణ్యాలు చేసినంత ఫలం, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యము దక్కుతుంది. పశువులకు మేతను దానం చేస్తే పాపాలు హరించబడతాయి అని పురాణాలు చెబుతున్నాయి.
గోమాతను శుక్రవారం పూజిస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివెరుస్తాయి. ఇంట్లో గోపూజ చేయడం కుదరని పక్షంలో ఆలయాల్లోని గోశాలల్లో నిర్వహించే పూజల్లో పాల్గొనడం ద్వారా కూడా శుభఫలితాలుంటాయి. ఆవుకు గో గ్రాసం సమర్పణ చేస్తే చక్కని సత్ఫలితాలు లభిస్తాయి. శుభ ముహూర్త కాలంలో గోపూజ చేయించడం, గోమాతను ఆలయాలకు దానంగా ఇవ్వడం వంటివి చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని గోమాత వహించింది. గోమాతలు మనల్ని పోషిస్తున్నాయి. గోమాత లక్ష్మీదేవి స్వరూపం. గోవుకు వేద ప్రమాణమయిన విశిష్టత ఉంది. కవ్వంచేత గో క్షీరాన్ని మధిస్తే వచ్చేటువంటి వెన్న, నెయ్యి దేవతలకు ప్రియమైనవి. గోదాన, హిరణ్య దానాలను యజ్ఞయాగాది క్రతువుల్లోనూ, పితృకర్మల్లోనూ చేయాలని మనుస్మృతి బోధిస్తోంది. అందుకే మన ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యానికి, వేడుకలు, యజ్ఞాలకు దేవతలను ఆహ్వానించే రీతిలో ఆవుపాలను వాడుతారని చెబుతున్నారు.
గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. సమస్త సృష్టిలోకి పవిత్రమైన గోమాతను రక్షిద్దాము, పూజిద్దాము సకల శుభాలను పొందుదాము….
ఓం నమో భగవతే గోమాత్రే నమః