ప్రపంచానికి చదువు చెప్పిన భారత దేశం!
మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియజెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం నా ధర్మం అన్పించింది.
ఈరోజున ఉన్నత విద్య కోసం మనం విదేశాలకు వెళ్తున్నాం. మన పిల్లల్ని పంపిస్తున్నాం. అయితే, కొన్ని వందల, వేల ఏళ్ళ క్రితమే ఆ దేశాలు మన దగ్గర పాఠాలు నేర్చుకున్నాయి. మన దేశం మీద దాడులు చేసి, మన గ్రంధాలను ఎత్తుకొని వెళ్ళాయి. మన విజ్ఞాన సంపదను దోచుకొని వెళ్ళాయి. వాటిని నేర్చుకోవటానికి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుండటం దురదృష్టకరం.
అఖండ భారత దేశంలో వందల, వేల ఏళ్ళ క్రితమే విశ్వవిద్యాలయాలు ఉండేవి. ప్రాధమిక విద్యలను గురుకులాల్లోనూ, ఉన్నత విద్యలను విశ్వవిద్యాలయాల లోనూ బోధించేవారు. అలనాటి మన విశ్వవిద్యాలయాల్లో చైనా, జపాన్, కొరియా, పర్షియా, టర్కీ. ఇండోనేషియా, టిబెట్, శ్రీలంక దేశాల నుంచి వచ్చిన వారు విద్యను అభ్యసించేవారు. తక్షశిల ,పుష్పగిరి,నలంద,తెలాహారా (బీహార్లో ఉన్న ఇది నలందాకన్నా ప్రాచీనమైనది), ఒదాంత పురి( బీహార్), సోమపుర (బంగ్లాదేశ్), శారదాపీఠం (పాకిస్తాన్), జగద్దల (బెంగాల్), నాగార్జున కొండ (ఆంధ్రప్రదేశ్), విక్రమశిల (బీహార్), వలభి (గుజరాత్), కాంచీపురం (తమిళనాడు) మన్యఖేట్ (కర్ణాటక) వంటి విశ్వవిద్యాలయాలు మనదగ్గర ఉండేవి. క్రీస్తుపూర్వం నుంచి వందల ఏళ్ళపాటు విరాజిల్లిన వాటిలో చాలా విశ్వవిద్యాలయాలు తురుష్కుల దండయాత్రల తర్వాత ధ్వంసం అయ్యాయి. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో వున్న విశ్వవిద్యాలయం ఒక్కటి మాత్రం క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దం నుంచి నేటి వరకు కొనసాగుతోంది. అది కూడా మధ్యమధ్యలో అనేక ఒడిదుడుకు లకు లోనయ్యింది.
భారతావనిలోని అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో తక్షశిల ముఖ్యమైనది. క్రీస్తుపూర్వం ఆరు-ఐదు శతాబ్దాల కాలంలో స్థాపించబడిన ఈ విద్యాలయం క్రీస్తు శకం ఐదో శతాబ్దం వరకు అంటే దాదాపు వెయ్యేళ్ళ పాటు ఉజ్వలంగా విలసిల్లింది.సాధారణంగా గురుకులాల్లో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక 16 వ ఏట విద్యార్ధులు ఈ విద్యాలయంలోకి ప్రవేశించేవారు. ఇందులో వేదవిజ్ఞానం, గణితం,ఖగోళం,న్యాయశాస్త్రం,వైద్యశాస్త్రం,యుద్ధతంత్రం బోధించేవారు. ఇవే కాకుండా, అష్టాదశ విద్యలైన విలువిద్య,వేట,గజరాజులను మచ్చిక చేసుకొని శిక్షణ ఇవ్వటం వంటివి కూడా నేర్పించేవారు. ఈ తక్షశిల గురించి బౌద్ధ జాతక కథలలో పలు ప్రస్తావనలు ఉన్నాయి.
కౌటిల్యుడుగా సుప్రసిద్ధుడైన చాణుక్యుడు తన అర్ధశాస్త్రాన్ని ,దీర్ఘాయుషు ప్రదాతగా పేరొందిన చరకుడు తన చరకసంహితను కూడా ఇక్కడే రాశాడని చెప్తారు.అలాగే, మౌర్య సామ్రాజ్యాధీశుడైన చంద్రగుప్తుడు కూడా ఇక్కడే విద్యలన్నీ నేర్చుకున్నాడని చరిత్రకారులు చెప్తారు.
మరో ముఖ్యమైన విశ్వవిద్యాలయం నలంద. ప్రస్తుత బీహార్లో క్రీస్తుశకం ఐదో శతాబ్దంలో స్థాపించబడి పన్నెండో శతాబ్దం వరకు దాదాపు 700 ఏళ్ళపాటు విజ్ఞానకాంతులు వెదజల్లినది. ఈ కాలంలో మానవ చరిత్ర గతిని మలుపులు తిప్పిన ఎందరెందరో జ్ఞానులను,మేధావులను తయారు చేసింది. సుప్రసిద్ధ గణిత వేత్త ఆర్యభట్ట (క్రీ.శ. 470-550), వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు,భాస్కరాచార్యులు వంటి వారు నలందలో తమ మేధకు పదును పెట్టిన వారే.ఇక్కడ బౌద్ధం ప్రధానాంశం అయినప్పటికీ, గణితం,ఖగోళం,వైద్యం, రాజకీయం, యుద్ధతంత్రంతో పాటు, సంగీతం,సాహిత్యం, చిత్రలేఖనం వంటివి కూడా బోధించేవారు.
ఈ విశ్వవిద్యాలయంలో ఎనిమిది వేర్వేరు కాంపౌండ్ లు ,పది ఆలయాలు,ధ్యానమందిరాలు,ఆరామాలు,తరగతి గదులు,సరస్సులు,ఉద్యానవనాలు ఉండేవి. ముఖ్యంగా తొమ్మిది అంతస్థుల అతిపెద్ద గ్రంధాలయం ఉండేది.అందులో అత్యంత విలువైన లక్షలాది పురాతన గ్రంధాలు ఉండేవి.వేలాది విద్యార్ధులు అక్కడ కూర్చొని తమకు అవసరమైన గ్రంధాలను కాపీ చేసుకొని రాతప్రతులు సిద్ధం చేసుకునే వారు. ఆ రోజుల్లోనే 10 వేలమంది విద్యార్ధులు, రెండు వేలమంది అధ్యాపకులు అక్కడ నివసించటానికి అవసరమైన వసతి సౌకర్యాలు విశ్వవిద్యాలయంలో ఉండేవి.
అలాద్దిన్ ఖిల్జీ అనే క్రూరుడు పోతూ పోతూ ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంధాలయం అయిన మన తక్షశిలని తగలేబెట్టేశాడు. అది పూర్తిగా ద్వంశం కావడానికి దాదాపు రెండు నెలల పైన సమయం పట్టింది. దీనిలో ఉన్న ఎన్నో విలువైన గ్రంధాలు కాలి భూడిద అవ్వడం వలన దేశ భవిష్యత్తు, దేశ తలరాత మారిపోయి ప్రజలు దిక్కుతోచని చదువులతో అల్లాడి పోతున్నారు. అతడివల్లనే మన సైంటిఫిక్ గ్రంధాలన్నీ తగలబడిపోవడం వలన హైందవ పరిశోధనలు ఆగిపోయాయి. మన శాస్త్రాల్లో ఉన్న సైన్సుని సరైన జవాబులు చెప్పడానికి ఇబ్బంది అవుతోంది. అంతేకాదు, వాడు 1500మంది ఆచార్యులని (అంటే ఇప్పటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు) కూడా అక్కడే ఒకేసారి దారుణంగా చంపాడు. మన విజ్ఞానానికి సర్వర్ లాంటిది ఆ యూనివర్సిటీ మరియూ నలందా విశ్వవిద్యాలయము.
మనదేశపు ఔనత్యాన్ని తెలియజేసే అంశాల్లో ఇది ఒకటి. వీటి గురించి కనీస అవగాహన లేని కొందరు అర్ధజ్ఞానులు మన దేశాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడటం శోచనీయం.